హైదరాబాద్, 17 జూలై (హి.స.)ఐపీఎల్ విజయోత్సవాల వేళ బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. దానిలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వంపై భాజపా విమర్శలు గుప్పించింది. ఆర్సీబీ విజయానికి ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవాలని చూసిందని, ఇప్పుడు ఫ్రాంచైజీని, కోహ్లీని నిందిస్తోందని దుయ్యబట్టింది (Bengaluru Stampede Report).
హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను బయటపెట్టింది. పోలీసుల నుంచి అనుమతులు తీసుకోకుండానే విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు జరిగే విజయోత్సవ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా ప్రజలను ఆహ్వానిస్తూ ఆర్సీబీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అభిమానులతో కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నట్లు విరాట్ మాట్లాడిన వీడియో క్లిప్ను షేర్ చేసిందని ఆ రిపోర్ట్ పేర్కొంది. ఇవన్నీ చిన్నస్వామి స్టేడియానికి భారీగా ప్రజలు తరలి రావడానికి దోహదం చేశాయని వెల్లడించింది. ఎంట్రీపాస్లపై నెలకొన్న గందరగోళం.. చివరకు తొక్కిసలాటకు దారితీసిందని తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు