బెగుసరాయ్:న్యూఢిల్లీ,19,సెప్టెంబర్ (హి.స.) విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం చొరబాటుదారులతో నిండిపోతుందని బిహార్ ప్రజలను కేంద్ర హోం మంత్రి అమిత్షా హెచ్చరించారు. చొరబాటుదారులకు మన దేశంలో ఓటు హక్కు ఉండాలా? మన ప్రజలకు లభించే మౌలిక వసతులు వారికీ చెందాలా? అని ఆయన ప్రశ్నించారు. ఓట్ల చోరీ అంటూ ఇండియా కూటమి నేతలు చేస్తోన్న తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలని బిహార్లోని భాజపా కార్యకర్తలను ఆయన కోరారు.
ఓటరు జాబితా ప్రక్షాళన కోసమే ఎన్నికల సంఘం ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్)ను చేపట్టిందని తెలిపారు. గురువారం డెహరీ ఆన్ సోన్, బెగుసరాయ్లలో నిర్వహించిన భాజపా కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. 20 జిల్లాలకు చెందిన కార్యకర్తలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. రాహుల్ గాంధీ నిర్వహించిన ‘ఓటర్ అధికార యాత్ర’పై చురకలు వేశారు. ‘‘బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులను రక్షించడమే రాహుల్ యాత్ర ముఖ్య ఉద్దేశం. మన యువతకు ఉద్దేశించిన ఉద్యోగాలు, ఉచిత వైద్యం, పక్కా ఇళ్లు అన్నీ వారి ఓటు బ్యాంకు అయిన చొరబాటుదారులకు అందించాలని రాహుల్ బాబా, ఆయన బృందం చూస్తున్నారు’’ అని అమిత్ షా విమర్శలు సంధించారు. భాజపా కార్యకర్తలు బిహార్లోని ప్రతి ఇంటికీ వెళ్లి ఈ విషయంపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. రాహుల్ విదేశీ యాత్రలపైనా చురకలు
వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ