ఏపీలో కొత్త ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి తీపికబురు.. వచ్చే నెలలోనే ముహూర్తం.. రెడీగా ఉండండి..
ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ ఉగాది గిఫ్ట్ అందించేందుకు రెడీ అవుతోంది. ఉగాది రోజున పేదలకు ఇళ్లను పంపిణీ చేయనుందని తెలుస్తోంది. టిడ్కో ఇళ్ల కోసం లబ్దిదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి కల నెరవేరనుంది. ఉగాది నాటికి పంపిణీ చేయనుంది.
AP


హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.)ఏపీలోని ఇల్లు లేనివారికి కూటమి సర్కార్ శుభవార్త అందించింది. కొత్త ఇళ్ల మంజూరుతో పాటు పూర్తైన ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. మార్చి 19న ఉగాదిని పురస్కరించుకుని పేదలకు ఇళ్లను మంజూరు, పంపిణీ చేసేందుకు సిద్దమైంది. పీఎం ఆవాస్ యోజన కింద ఇప్పటికే కొత్త ఇళ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా.. ఇప్పుడు వాటి పరిశీలన పూర్తైంది. ఉగాది రోజున అర్హులైన వారికి ఇళ్లను నిర్మించుకునేందుకు మంజూరు పత్రాలు అందించనున్నాయి. ఉగాది నాటికి కొత్త ఇళ్లను మంజూరు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు కూడా పలుమార్లు ప్రకటించారు. ఆ దిశగా కసరత్తు జరుగుతూండగా.. తాజాగా మరో కీలక ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి అందింది.

ఉగాది నాటికి లక్ష టిడ్కో ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఉగాది రోజున వీటిని లబ్దిదారులకు పంపిణీ చేయనుంది. 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. అయితే ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఇళ్ల నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. వైసీపీ సర్కార్ పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి ఇళ్లు పనికిరాకుండా పోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటి నిర్మాణంపై మళ్లీ దృష్టి పెట్టింది. వీటిని లబ్దిదారులకు అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా 40,500 మంది లబ్దిదారులకు ఇళ్లు అందించేందుకు వీటి నిర్మాణానికి రూ.1354 కోట్ల రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు అంగీకరించాయి.

బ్యాంకు నిధులతో త్వరలోనే వీటి నిర్మాణాలు వేగంగా పూర్తి చేసి ఉగాది నాటికి లబ్దిదారులకు పంపిణీ చేసేలా కూటమి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఉగాది రోజు వీటిని పేదలకు అందిస్తామని ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ తెలిపారు. ఈ టిడ్కో ఇళ్ల కోసం లబ్దిదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అందుతాయా అని కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు మోక్షం లభించడం, త్వరలోనే పంపిణీకి ప్రభుత్వం సిద్దమవ్వడంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉగాది నాటికి 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరోవైపు ఉగాది రోజున మరికొన్ని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. విశాఖపట్నంలోని కైలాసగిరిపై భారీ త్రిశూలాన్ని ఆవిష్కరించేందుకు సిద్దమవుతోంది. మొత్తానికి ఉగాదికి ప్రజలకు ప్రభుత్వం మరిన్ని గిఫ్ట్లు ఇచ్చేందుకు రెడీ అవుతోందని చెప్పవచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande