
హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.)
ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor
Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సహా పలువురికి క్లీన్ చీట్ ఇస్తూ.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అదే సమయంలో సీబీఐ నమోదు చేసిన కేసును కోర్టు కొట్టివేయడంతో.. ఈ కేసులో ఉన్న నిందితులందరికీ భారీ ఊరట లభించింది. తాజాగా ఈ పరిణామంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Arvind Dharmapuri) స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో కేవలం సాక్ష్యాలు లేవని మాత్రమే చెప్పారు తప్ప, కవిత నిర్దోషని క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. కవిత చెబుతున్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటి కాదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారని, వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు