
హైదరాబాద్, 02 మార్చి (హి.స.)
జీఎస్టీ వసూళ్ళలో తెలంగాణ దూకుడు ప్రదర్శించింది. 2026 ఫిబ్రవరి నెలలో ఏకంగా రూ. 4,125 కోట్ల GST వసూళ్లను సాధించింది. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 14% వృద్ధిని నమోదు చేయడం విశేషం. దేశంలోని ఇతర అగ్రగామి రాష్ట్రాలతో పోటీ పడుతూ రాష్ట్రం రెండంకెల వృద్ధిని సాధించడం వెనుక ఉన్న ప్రధాన కారణం హైదరాబాద్ వంటి అంతర్జాతీయ స్థాయి నగరం.. అలాగే దాని చుట్టూ విస్తరించిన ఐటీ, ఫార్మా, మరియు సేవా రంగాలు అని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగాల నుండి వస్తున్న పన్ను ఆదాయం రాష్ట్ర ఖజానాకు వెన్నెముకగా నిలుస్తోంది. ఐటీ ఎగుమతులు పెరగడం, కొత్తగా మరిన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తమ కార్యాలయాలను ఇక్కడ ప్రారంభించడం వల్ల ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ ఆదాయం సమకూరుతోంది.
మరోవైపు ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పెరగడం, కొత్త వెంచర్లు మరియు అపార్ట్మెంట్ల నిర్మాణాలు పెరగడంతో అనుబంధ రంగాలైన సిమెంట్, స్టీల్ మరియు హార్డ్వేర్ అమ్మకాలు కూడా పెరిగి GST వసూళ్లు భారీగా పెరిగాయి. దీనికి తోడు, తెలంగాణ ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ పన్ను ఎగవేతను అరికట్టడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ, డేటా అనలిటిక్స్ ద్వారా పన్ను చెల్లింపులను పకడ్బందీగా పర్యవేక్షిస్తోంది. డిజిటల్ లావాదేవీలు ప్రాచుర్యంలోకి రావడం వల్ల చిరు వ్యాపారుల నుండి పెద్ద కంపెనీల వరకు పన్ను పరిధిలోకి రావడం రాష్ట్ర ఆదాయానికి పెద్ద ప్లస్ పాయింట్గా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..