
అమరావతి, , 02 మార్చి (హి.స.)ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు తన పాలనలో ‘రియల్-టైమ్ గ్రాస్ సెటిల్మెంట్’(RTGS) ‘పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్’ (PPP) ప్రజాభిప్రయాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. సోమవారం ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్షెప్సన్పై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవలపై ప్రజలు సంపూర్ణంగా సంతృప్తి చెందాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారుల తీరుపై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకూడదని తేల్చిచెప్పారు. ఈ నెల నుంచి కనీసం 80 శాతం నుంచి 90 శాతం తగ్గకుండా పబ్లిక్ పర్షెప్సన్ ఉండాలని స్పష్టం చేశారు
ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ..‘పెన్షన్ల పంపిణీలో లోటుపాట్లు తలెత్తుతున్న స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆర్టీసీ బస్సు సర్వీసులు బావున్నా.. ఆర్టీసీ బస్ స్టేషన్లో సౌకర్యాలు, ఔట్ సోర్సింగ్ సర్వీసులు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలి. బస్ స్టేషన్కు వచ్చిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరే వరకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలి. రాష్ట్రంలో వరుస ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలి, ముందస్తు జాగ్రత చర్యలు తీసుకోవాలి. బాణసంచా పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలపై అధికారులు శివకాశీకి వెళ్లి అధ్యయనం చేసిరావాలి. రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలు, సిబ్బంది పనితీరు బాగుంది. అవినీతికి తావులేకుండా రాష్ట్రంలోని మొత్తం 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిజాయితీ కలిగిన అధికారులకే అవకాశం ఇవ్వాలి. వాట్సప్ మనమిత్ర సేవలు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి, నూటికి నూరు శాతం వాట్సప్ సేవల వినియోగం జరగాలి. అన్ని శాఖల పనితీరు మెరుగు పరుచుకునేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి’ అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్