
హైదరాబాద్, 21 మార్చి (హి.స.)టీమిండియా జట్టుకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ టూర్ లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా తలపడనుంది. తాజాగా ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ శనివారం అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు మ్యాచ్లు జూన్ 26,28వ తేదిల్లో బెల్ఫాస్ట్ వేదికగా జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
టీ20 ప్రపంచకప్ 2026 ఛాంపియన్స్గా నిలిచిన తర్వాత భారత్కు ఇదే తొలి టీ20 సిరీస్ కావడం గమనార్హం. వాస్తవానికి ఈ సిరీస్ టీమిండియా 'ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్'లో లేదు. ఐపీఎల్-2026 సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో అఫ్గానిస్థాన్ తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. జూన్ 6-20 మధ్య టీమిండియా- ఆఫ్గనిస్థాన్ మధ్య సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాత ఐర్లాండ్ వెళ్లనుంది. అక్కడ రెండు టీ20 మ్యాచుల అనంతరం జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్ ఖరారైంది. గత ఎనిమిదేళ్లలో (2018, 2022, 2023) భారత్ మూడుసార్లు ఐర్లాండ్లో పర్యటించింది. అయితే దాదాపు 19 ఏళ్ల తర్వాత బెల్ఫాస్ట్ మైదానంలో భారత్ తిరిగి ఆడనుంది. ఈ గ్రౌండ్లో 2007లో చివరి సారిగా భారత్, ఐర్లాండ్తో తలపడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్