
నంద్యాల , 21 ఏప్రిల్ (హి.స.)నంద్యాల జిల్లాలో ఈరోజు ఉదయం రైలు ప్రమాదం జరిగింది. సంజామల మండలం రెడ్డిపల్లి వద్ద ఓ గూడ్స్ రైలు ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ నడుపుతున్న రైతుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళితే, రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం తన ట్రాక్టర్పై పొలానికి బయలుదేరారు. మార్గమధ్యంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా, వేగంగా వస్తున్న గూడ్స్ రైలు ఆయన ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పల్టీలు కొట్టడంతో రామచంద్రారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, ఇతర రైతులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన రైతును హుటాహుటిన కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV