
తిరుమల, 21 ఏప్రిల్ (హి.స.)
వేసవి సెలవులు ప్రారంభం కావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం అయిన వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 12 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి సుమారు 6 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. సోమవారం ఒక్కరోజే 80,084 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు 28,929 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.69 కోట్లు వచ్చినట్లు టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, దర్శనానికి వచ్చే వారు తగిన ఏర్పాట్లతో రావాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV