
ఢిల్లీ, 27 ఏప్రిల్ (హి.స.)దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్పై ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో అతడు మృతి చెందాడు. మృతుడి స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఢిల్లీ శివారు జాఫర్పూర్ కలాన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాండవ్ కుమార్ (21), అతడి స్నేహితుడు కృష్ణ ఓ పుట్టినరోజు వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు. రోడ్డుపై నిలబడి స్నేహితులతో మాట్లాడుతుండగా ఎదురింట్లో నివసించే హెడ్ కానిస్టేబుల్ నీరజ్ అక్కడికి వచ్చి వారితో వాగ్వివాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన నీరజ్, బైక్పై ఉన్న పాండవ్ ఛాతీపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు.
బుల్లెట్ పాండవ్ శరీరం నుంచి దూసుకెళ్లి, వెనుక కూర్చున్న కృష్ణ పొట్టలోకి దిగింది. ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించగా, పాండవ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కృష్ణకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
ఘటన సమయంలో నిందితుడు నీరజ్ మద్యం మత్తులో ఉన్నాడని, కులం పేరుతో దూషించాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మేము బిహార్కు చెందిన వాళ్లమని తెలియగానే, అతడు కాల్పులు జరిపి పారిపోయాడు అని పాండవ్ తల్లి మీనా దేవి కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమారుడి మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. కుటుంబానికి పాండవ్ ఒక్కడే ఆధారం అని బంధువులు తెలిపారు.
ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. స్పెషల్ సెల్లో పనిచేస్తున్న నిందితుడు నీరజ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi