టూరిస్ట్ వీసాపై వచ్చి మత బోధనలు.. దేశం విడిచి వెళ్లాలని ముగ్గురు అమెరికన్లకు ఆదేశాలు
టూరిస్ట్ వీసాపై వచ్చి మత బోధనలు.. దేశం విడిచి వెళ్లాలని ముగ్గురు అమెరికన్లకు ఆదేశాలు
mata


పూణె, 30 ఏప్రిల్ (హి.స.)

టూరిస్ట్ వీసాపై భారత్కు వచ్చి మత ప్రచార కార్యకలాపాల్లో పాల్గొంటున్న ముగ్గురు అమెరికా పౌరులను దేశం విడిచి వెళ్లాల్సిందిగా పూణె పోలీసులు ఆదేశించారు. మే 10వ తేదీలోగా వారు భారత్ను వీడాలని 'లీవ్ ఇండియా' నోటీసులు జారీ చేశారు. వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళితే... 53, 65, 66 ఏళ్ల వయసున్న ముగ్గురు అమెరికా జాతీయులు ఈ నెల మొదట్లో టూరిస్ట్ వీసాపై భారత్కు వచ్చారు. పూణెలో పర్యటిస్తున్న వీరు, ఓ ట్యాక్సీ డ్రైవర్కు క్రైస్తవ మతం, బైబిల్కు సంబంధించిన కరపత్రాలు ఇచ్చి తమ మతంలోకి ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇంగ్లిష్, హిందీ, మరాఠీ భాషల్లో ముద్రించిన ఈ కరపత్రాలను చూసిన డ్రైవర్, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

డ్రైవర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీ సంఖ్యలో మతపరమైన కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఓ)కు తరలించి విచారించారు. విచారణలో వారు టూరిస్ట్ వీసా నిబంధనలను ఉల్లంఘించి మత ప్రచారం చేస్తున్నట్లు తేలింది.

ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ యాక్ట్ల కింద ఈ ముగ్గురికీ నోటీసులు ఇచ్చాం. టూరిస్ట్ వీసాపై వచ్చిన విదేశీయులు ఎలాంటి మత ప్రచారంలో పాల్గొనడానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘించినందుకే ఈ చర్యలు తీసుకున్నాం అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ భజిభకరే తెలిపారు. గతంలోనూ పూణె, పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయని, ఈ నేపథ్యంలో నిఘా పెంచామని ఆయన వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande