
ఏలూరు, 09 ఏప్రిల్ (హి.స.)ద్వారకా తిరుమల నకిలీ టికెట్ల స్కాం వ్యవహారంలో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. ప్రధాన నిందితుడు రాజుతోపాటు మరో ఆరుగురు దేవస్థానం ఉద్యోగులను అరెస్ట్ చేశామని చెప్పారు. గురువారం ఏలూరులో డీఎస్పీ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. నిందితుల వద్ద నుంచి నకిలీ టికెట్ల ప్రింటింగ్కు ఉపయోగించిన ల్యాప్ట్యాప్, ప్రింటర్, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఈ ఏడాది మార్చి రెండో వారంలో ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నకిలీ దర్శనం టికెట్ల విక్రయం బహిర్గతమైంది. ఆలయంలో స్కానింగ్ పాయింట్ వద్ద కొన్ని దర్శనం టికెట్లు స్కాన్ కాకపోవడంతో ఈ వ్యవహారం బట్టబయలు అయింది. ఈ వ్యవహారంలో దేవస్థానం ఏఈవో రమణరాజు కుమారుడు రాజు ప్రధాని నిందితుడు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
దేవాలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో సిబ్బంది తగు జాగ్రత్తలు పాటిస్తుంటారు. భక్తులు.. కౌంటర్లో టికెట్లు కొనుగోలు చేసి దేవాలయంలో ప్రవేశించి.. స్కానింగ్ పాయింట్ వద్ద భద్రతా సిబ్బందికి వాటిని ఇస్తారు. వారు ఈ టికెట్లను స్కాన్ చేసి భక్తులను దేవాలయంలోకి అనుమతిస్తారు.
ఆలయంలో ఏఈవో కుమారుడు రాజు దేవాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.200 టికెట్లను అతడు టికెట్ కౌంటర్లో విక్రయించాడు. అవి ఆలయంలో స్కానింగ్ పాయింట్ల వద్ద స్కాన్ చేస్తే.. టికెట్లు స్కాన్ కావడం లేదు. దీంతో ఈ విషయాన్ని దేవస్థానం ఉన్నతాధికారుల దృష్టికి భద్రతా సిబ్బంది తీసుకెళ్లారు. వారు వెంటనే రంగంలోకి దిగి.. కౌంటర్లో జారీ చేసిన టికెట్లను పరిశీలించారు. అవి 61 టికెట్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ టికెట్లు జారీ చేసిన రాజును దేవస్థానం అధికారులు ప్రశ్నించారు. అనంతరం ఈ వ్యవహారంపై పోలీసులకు దేవస్థానం ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ కేసులో మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్