
ముంబై, 18 మే (హి.స.)
స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే (Black Monday) మరోసారి రుజువైంది. సోమవారం సెన్సెక్స్ ప్రారంభ సెషన్ లోనే భారీగా పతనమైంది. పశ్చిమాసియా (Middle East) లో నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు సంక్షోభం దేశీయ ఆర్థిక మార్కెట్లను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ఈ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వారరంభం రోజైన సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) ఏకంగా 800 పాయింట్లకు పైగా కుప్పకూలగా.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ (Nifty) కూడా 250 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇరాన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా దెబ్బతింటుందనే భయాలతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయాలకు మొగ్గు చూపడం, ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగానికి చెందిన కీలక షేర్లు ఒత్తిడికి లోనవడంతో కేవలం ఒక్క రోజులో ఇన్వెస్టర్ల లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది.
చమురు మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో దిగుమతుల ఖర్చులు పెరగడం, డాలర్కు డిమాండ్ విపరీతంగా పెరగడంతో భారత రూపాయి (INR) విలువ చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోరంగా పతనమైంది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 96.32 కి పడిపోయి సరికొత్త ఆల్టైమ్ లో (All-Time Low) రికార్డును నమోదు చేసింది. ముడి చమురు కొరతతో దేశీయంగా రవాణా వ్యయం పెరిగి ద్రవ్యోల్బణం ఎగబాకే ప్రమాదం ఉండటం, దానిని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు మార్కెట్లను మరింత దెబ్బతీశాయి. రూపాయి విలువ ఇలాగే క్షీణిస్తే రాబోయే రోజుల్లో దిగుమతుల భారం మరింత పెరిగి సామాన్యుడి బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు