
ఢిల్లీ, 31 మే (హి.స.)
టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య తన వ్యక్తిగత హక్కుల (పర్సనాలిటీ రైట్స్) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నటి సమంత రుత్ ప్రభుతో తన గత బంధాన్ని ఉద్దేశించి కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు చేస్తున్న అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం నాగచైతన్య ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆయన పేరు, ఫొటోలు, వీడియోలను వాడొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పలు వెబ్సైట్లకు నోటీసులు కూడా జారీ చేసింది.
నాగచైతన్య తరఫున సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్ వాదనలు వినిపించారు. కొన్ని ఆన్లైన్ మాధ్యమాలు సమంతను చైతన్య మోసం చేశారని, ఆమె కెరీర్ను నాశనం చేశారని నిరాధారమైన కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇది కేవలం విమర్శ కాదు, కచ్చితంగా వ్యక్తిగత వేధింపులు, ట్రోలింగ్ కిందకే వస్తుంది అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, నటుడి ప్రతిష్ఠను కించపరిచేలా ఉన్న కంటెంట్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
‘ఏ మాయ చేసావె’ (2009) సినిమా సమయంలో పరిచయమైన నాగచైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారు. అయితే, నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2021 అక్టోబర్లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరూ తమ జీవితాల్లో ముందుకు సాగారు. నాగచైతన్య 2024 డిసెంబర్లో నటి శోభితా ధూళిపాళ్లను, సమంత 2025 డిసెంబర్లో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు.
ఇలా ఇద్దరూ కొత్త జీవితాలను ప్రారంభించి స్థిరపడినప్పటికీ, కొందరు పాత విషయాలనే పదేపదే ప్రస్తావిస్తూ ఆన్లైన్లో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతుండటంపై నాగ చైతన్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi