
భద్రాద్రి కొత్తగూడెం, 04 మే (హి.స.)
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అందరి రైతులకు సహాయం చేసి ఆదుకుందాం. ప్రతి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో రాజకీయం చేయకండి అని ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య అన్నారు. సోమవారం మండలంలోని గంధంపల్లి, బయ్యారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గన్ని బస్తాల కొరత కాంటాల నిర్వహణ లారీలలో ధాన్యం తరలింపు పై వర్షం వస్తే ధాన్యం తడుస్తుందని ఆవేదనతో రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీని పై ఎమ్మెల్యే స్పందించి గన్ని బస్తాల సదరు కాంట్రాక్టర్ ఫోన్ చేసి గన్ని బస్తాలను వెంటనే కొనుగోలు కేంద్రాలకు పంపిణీ చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో కొంతమంది నాయకులు రాజకీయం చేస్తున్నారని రైతులకు ధైర్యం చెప్పవలసిన నాయకులే వారిని పక్కదారి పట్టించే విధంగా రైతులతో ప్రభుత్వం పై ఉసిగొలుపుతున్నారని మండిపడ్డారు. రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి ఆన్లైన్ ద్వారా విక్రయాలు చేపట్టాలని కోరారు. వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు రైతుల కౌలు, సాగు దారులు ధాన్యం వివరాలు నమోదు చేయాలని ఏఓ కె.రాజును ఆదేశించారు. కేంద్రాలలో ఎప్పటికప్పుడు సొసైటీ సీఈవో రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, ఆదేశించారు. రైతుల పట్ల అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మండలంలో మార్కెట్ కమిటీ గిడ్డంగులను పరిశీలించారు. రైతుల ధాన్యం తడవకుండా గిడ్డంగులలో నిలువ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు