
అస్సాం , 06 మే (హి.స.)
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేది లేదని మమతా బెనర్జీ స్పష్టం చేసిన నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. ఆమె రాజీనామా చేయకపోతే, బర్తరఫ్ చేయడమే ఏకైక మార్గమని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ప్రజలు ఆమెను, ఆమె తప్పులను చాలాకాలంగా సహించారని ఆయన అన్నారు.
ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ... ఆమె రాజీనామా చేయకపోతే, ఆమెను తొలగిస్తారు. దేశం ఆమె ఇష్టానుసారం నడవదు. గవర్నర్ కొంతకాలం వేచి చూసి, ఆ తర్వాత ఆమెను బర్తరఫ్ చేస్తారు. ఇది చాలా సులభమైన విషయం అని స్పష్టం చేశారు. మమత వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
మూడు పర్యాయాలు అధికారంలో కొనసాగిన మమతా బెనర్జీ, నిన్నటి ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చేతిలో ఓటమి చవిచూశారు. బెంగాల్లోని 293 స్థానాలకు గాను బీజేపీ 206 సీట్లు గెలుచుకోగా, తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. అయితే, ఈ ఫలితాలను అంగీకరించని మమత, తాను ఓడిపోలేదని, అందుకే రాజ్భవన్కు వెళ్లి రాజీనామా సమర్పించబోనని ప్రకటించారు. దాదాపు 100 సీట్లను తమ నుంచి లాక్కున్నారని ఆమె ఆరోపించారు.
మమత ఆరోపణలను హిమంత కొట్టిపారేశారు. 100 సీట్లు లాక్కున్నారని మీరు అంటున్నారు. అలా అయితే, కాంగ్రెస్ గెలిచిన 19 సీట్లు నా నుంచి లాక్కున్నారని నేను కూడా చెప్పగలను. దేశం అలా పనిచేయదు అని అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ద్వారా ఓట్ల దొంగతనం జరిగిందన్న తృణమూల్ ఆరోపణల్లో పసలేదని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఎస్ఐఆర్ జరిగింది. దీనిపై మీరు సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ, ఎన్నికల కమిషన్ చర్య సరైనదేనని, మీ వాదన తప్పని కోర్టు స్పష్టం చేసింది. ఆ చర్చ అక్కడితోనే ముగిసింది అని హిమంత గుర్తుచేశారు.
సాధారణంగా ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసే అధికారం గవర్నర్కు ఉంటుంది. కానీ, సుప్రీంకోర్టు తీర్పుల రూపంలో దీనిపై కొన్ని నియంత్రణలు ఉన్నాయి. బెంగాల్ అసెంబ్లీ గడువు మే 7తో ముగియనుంది. ఈలోగా, ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తే ఈ రాజ్యాంగ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi