
హైదరాబాద్, 04 జూలై (హి.స.)సిటీ బస్సుల ట్రిప్పులను ఆకస్మికంగా రద్దు చేసే చర్యలను అరికట్టేందుకు ఆర్టీసీ భారీ కసరత్తు చేపట్టింది. ఉదయం మొదటి బస్సు నుంచి రాత్రి చివరి బస్సు వరకు పూర్తిస్థాయిలో నడిపేందుకు నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేసింది. సాధారణంగా డ్రైవర్లు, కండక్టర్లు వివిధ కారణాలతో చివరి ట్రిప్పు సర్వీసులను రద్దు చేస్తుండటంతో అప్పటిదాకా ఎదురుచూసిన ప్రయాణికులు చివరకు ఆటోలు, క్యాబ్లు ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజూ వందల సంఖ్యలో ట్రిప్పులు రద్దవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ఆర్టీసీ ఆదాయానికి సైతం గండి పడుతోంది. ఈ క్రమంలో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిటీ బస్సుల నిర్వహణపై సీరియస్గా దృష్టి సారించారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో అధికారులు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో స్వయంగా విధులు నిర్వర్తించేలా దిశా నిర్దేశం చేశారు. దీంతో కొద్ది రోజులుగా నగరంలో సిటీబస్సుల ట్రిప్పుల సంఖ్య పెరిగింది. గతంలో నిత్యం 34,200 ట్రిప్పులు తిరిగితే.. ప్రస్తుతం 3,5000కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఏదో ఒక కారణంతో ఆర్టీసీ సిబ్బంది తెల్లవారుజామున బయలుదేరాల్సిన బస్సులను, రాత్రిపూట చేరుకోవాల్సిన చివరి సర్వీసులను రద్దు చేస్తున్నారు. దీంతో సెవెన్సీటర్ వంటి ఆటో రిక్షాలు, ఇతర మార్గాల్లో ప్రయాణికులు వెళ్తున్నారు. ప్రస్తుతం ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని డిపోల్లో బస్సులను పూర్తిగా నడపడంతో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందజేస్తున్నామని ఈడీ శ్రీధర్ తెలిపారు. ‘ప్రస్తుతం 26 డిపోల ద్వారా రోజుకు 3,200 బస్సులు నడుపుతున్నాం. వీటిలో ఏ ఒక్కటి రద్దయినా సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సిందే’ అని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్