
అమరావతి, 04 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూముల బదలాయింపు ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఇప్పటికే నామమాత్రపు స్టాంప్ డ్యూటీతో రిజిస్ట్రేషన్లకు అనుమతించిన సర్కార్, తాజాగా మరో కీలక ముందడుగు వేసింది. వారసత్వ ఆస్తుల పంపకాల దస్తావేజు రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే, ఆటోమేటిక్గా మ్యుటేషన్ (రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పిడి) జరిగేలా కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయంతో భూ యజమానులు మ్యుటేషన్ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు తప్పనున్నాయి.
పాత పద్ధతికి స్వస్తి.. కొత్త విధానం ఇలా
ఇంతకుముందు, కుటుంబ పెద్ద మరణానంతరం వారసులు తమ పేర్ల మీదకు భూమిని మార్చుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారు. ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (ఎఫ్ఎంసీ) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత రెవెన్యూ అధికారులను ఆశ్రయించి మ్యుటేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో పాటు, రైతులకు శ్రమ, ఖర్చుతో కూడుకున్నదిగా ఉండేది.
తాజా విధానం ప్రకారం, కుటుంబ సభ్యులు తమ మధ్య ఆస్తులను పంచుకుంటూ రాసుకున్న పంపకాల దస్తావేజును సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించిన వెంటనే, ఆ సమాచారం ఆన్లైన్లో రెవెన్యూ శాఖకు చేరుతుంది. దీని ఆధారంగా రెవెన్యూ రికార్డుల్లో వారసుల పేర్లను నమోదు చేసే 'ఆటో-మ్యుటేషన్' ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఏకకాలంలో జరిగిపోతాయి.
వీలునామా లేకపోతే ఎఫ్ఎంసీ తప్పనిసరి
అయితే, ఈ ప్రక్రియలో ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిబంధనను చేర్చింది. కుటుంబ పెద్ద (తాత, తండ్రి లేదా తల్లి) ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే, వారసులు ఆస్తి పంపకాల దస్తావేజును రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తప్పనిసరిగా ఎఫ్ఎంసీ సమర్పించాల్సి ఉంటుంది. వీలునామా ఉంటే ఈ నిబంధన వర్తించదు.
రైతులకు భారీ ఊరట
గతంలో ఏపీ ప్రభుత్వం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రూ. 10 లక్షల లోపు విలువైన వ్యవసాయ భూమికి కేవలం రూ. 100 స్టాంప్ డ్యూటీగా, రూ. 10 లక్షలు దాటితే రూ. 1,000గా నిర్ణయించింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ను మ్యుటేషన్తో అనుసంధానించడం వల్ల రైతులకు పూర్తిస్థాయిలో హక్కులు వేగంగా లభిస్తాయి. పట్టాదారు పాస్పుస్తకాలు సకాలంలో చేతికి అందడంతో పాటు ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు పొందడం కూడా సులభతరం అవుతుంది. ఈ సమీకృత విధానం పరిపాలనలో పారదర్శకతను పెంచడంతో పాటు, రైతులకు భరోసా కల్పిస్తుందని అధికారులు చెబుతున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi