
ఢిల్లీ, 16 ఆగస్టు (హి.స.) నేడు భారత మాజీ ప్రధాని, భారతరత్న దివంగత అటల్ బిహారీ వాజ్పేయి (Atal Bihari Vajpayee) వర్ధంతి. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఆయన స్మారక స్థలం 'సదైవ్ అటల్' వద్ద దేశ ప్రముఖులు ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్మారక స్థలానికి చేరుకుని వాజ్పేయి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సైతం పుష్పాంజలి ఘటించి వాజ్పేయి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
ఈ స్మారక కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. దేశ సమగ్ర అభివృద్ధికి, సుపరిపాలనకు, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి అటల్ బిహారీ వాజ్పేయి అందించిన అసమాన సేవలను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. ఆయన నిస్వార్థ నాయకత్వం, సిద్ధాంతాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV