
కోనసీమ జిల్లా, 24 ఆగస్టు (హి.స.)
,అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 3వ తేదీన సముద్రంలోకి వేటకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, 21 రోజులు దాటినా వారి ఆచూకీ ఇంకా కానరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. డ్రోన్లు, కోస్ట్ గార్డు నౌకలతో సముద్రంలో ఎంత వెతికినా ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ దొరకడం లేదు.
మత్స్యకారుల గుర్తింపునకు కేంద్ర హోం శాఖ సహాయాన్ని మెరైన్ అధికారులు అభ్యర్థించారు. విదేశీ జలాల్లో ఓడలరేవుకు చెందిన బోటు, మత్స్యకారులకు సంబంధించి ఏమైనా ఆనవాళ్లు, సమాచారం తెలిస్తే వెంటనే తెలియజేశాలా మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలను సంప్రదించాలని హోం శాఖకు కోస్ట్ గార్డ్, భారత నౌకాదళ అధికారులు నివేదించారు. కోనసీమ జిల్లా అల్లవరం ఓడల రేవు నుంచి ఈనెల 3వ తేదీన సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లిన విషయం తెలిసిందే.
మూడు వారాలైనా మత్స్యకారుల ఆచూకీ దొరకకుండా పోయింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటివరకు తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు అధికారులు గాలిస్తున్నా వారి జాడ కనబడలేదు. వారి బోటు మరమ్మతులకు గురైతే గాలి ఆధారంగా మయన్మార్, అండమాన్ నికోబార్ దీవుల వైపు వెళ్లి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పది రోజుల్లో వేట ముగించుకుని వస్తామని ఈ నెల 3న బయలుదేరి ఇప్పటికీ తీరం చేరకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ