
ఇడుపులపాయ, 02 సెప్టెంబర్ (హి.స.)
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ భార్య విజయమ్మ కూడా పుష్పగుచ్ఛాలతో ఆయనకు ప్రత్యేక నివాళులర్పించారు. జగన్ భార్య భారతితో పాటు వైఎస్సార్ కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, ఆయన అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి 2009వ సంవత్సరం, సెప్టెంబర్ 2వ తేదీన రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతూ నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాలగుట్టలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004 నుంచి 2009 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయారు. ఆయన మరణించి 17 సంవత్సరాలు అవుతున్నా ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేశారు.
వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. మిస్ యూ ఆల్వేస్, డాడ్! యూ విల్ ఫరెవర్ బీ మై ఇన్స్పిరేషన్ అంటూ తండ్రిని తలచుకుంటూ పోస్ట్ చేశారు. వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి పూలమాల వేసి స్మరించుకుంటున్న ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. జగన్తో పాటు పార్టీ నాయకులు కూడా ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV