అమరావతి, 14 అక్టోబర్ (హి.స.)
గుంటూరు, అక్టోబర్ 14: ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో ఇవాళ దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి హత్యకు గురయ్యాడు. కైలాష్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద కొబ్బరికాయల కత్తితో జ్యూటూరి బుజ్జి(50) అనే వ్యక్తిని దుండగుడు నరికి చంపారు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగుడు స్కూటీపై మాస్క్ వేసుకొని వచ్చి హత్య చేసి పరార్ అయినట్టు స్థానికులు చెబుతున్నారు. మృతుడు అమర్తులూరు మండలం కోడితాడిపర్రు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చెంచుపేటలో కూతురి ఇంటికి వచ్చి బుజ్జి.. టిఫిన్ చెయ్యటానికి బయటకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే దుండగులు అతనిపై ఘోరంగా దాడి చేసి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం సమాచారం తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ