హైదరాబాద్, 8 అక్టోబర్ (హి.స.)
మానసిక ఆరోగ్యంపై అవగాహన కీలకమని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అహెంతం శాంటా సింగ్ అన్నారు. బుధవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. వైద్య విద్యార్థులు ఫ్లాష్ మాబ్ ద్వారా రోగులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ.. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేన్నయినా సాధించగలుగుతాడన్నారు. కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానవ వికాసానికి మానసిక ఆరోగ్యం మరెంతో కీలకం అన్నారు.
నేటి సమాజంలో చాలా మందికి మానసిక ఆరోగ్యంపై అవగాహన ఉండటం లేదని అందరూ అవగాహన పెంచుకోవాలన్నారు. నిద్రలేచిన మొదలు పడుకునే వరకు యంత్రంలా పని చేస్తున్నారని, దీంతో ఒత్తిడికి లోనై అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. మనిషి మానసిక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తే జీవితం అంత బాగుంటుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు