అమరావతి, 9 అక్టోబర్ (హి.స.)
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు.. పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ముందుగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రాజమండ్రి విమానాశ్రయం చేరుకోనున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి హెలికాప్టర్లో కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్కు వెళ్తారు. ఆ తరువాత నేరుగా కాకినాడ కలెక్టరేట్కు చేరుకుంటారు. దివీస్ ఫార్మా కంపెనీల నుంచి విడుదలయ్యే రసాయనాలతో ఉప్పాడ సముద్ర తీరం కలుషితమవుతోందని.. మత్స్య సంపద క్షిణించి జీవనోపాధి కోల్పోపోతున్నామని గత కొంత కాలంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కలెక్టరేట్లో మత్స్యకార సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో సమావేశమై.. సముద్రంలో కాలుష్యం, నష్టపరిహారం చెల్లింపు, మత్స్యకారుల సమస్యలు, ఉప్పాడ తీరం కోతకు గురికావడం వంటి అంశాలపై చర్చిస్తారు పవన్ కల్యాణ్.
మత్స్యకారులతో సమావేశం ముగిసిన తరువాత స్థానిక జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఉప్పాడ చేరుకుంటారు జనసేనాని పవన్. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.10 గంటలవరకూ ఉప్పాడ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఉప్పాడలో బహిరంగసభలో మత్స్యకారుల భరోసా కల్పించేలా మాట్లాడనున్నారు. పవన్ పర్యటన దృష్ట్యా.. ఎలాంటి ఘటనలు జరగకుండా 550 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఏఎస్పీ, ముగ్గురు డీసీపీలతో సహా 550 మందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.. మరోవైపు, కలెక్టరేట్లో కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ