
ఢిల్లీ 13,డిసెంబర్ (హి.స.) టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిష్ దాఖలు చేశారు. సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలపై తన పేరు, ఫొటోలు అక్రమంగా వాడుకుంటున్నారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఢిల్లీ కోర్టు విచారణ జరిపి తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. గావస్కర్(Sunil Gavaskar) దావాను అధికారిక ఫిర్యాదుగా పరిగణించి, హక్కులు ఉల్లంఘిస్తున్న సోషల్ మీడియా సంస్థలు వెంటనే ఆ కంటెంట్ను తొలగించాలని సూచించింది.
ఆన్లైన్లో అభ్యంతరకర కంటెంట్పై చర్యలు కోరే వ్యక్తులు, ముందుగా ఐటీ నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న ఫిర్యాదుల యంత్రాంగాన్ని వినియోగించుకోవాలని, ఆ తర్వాతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల బేసిక్ సబ్స్క్రైబర్ ఇన్ఫర్మేషన్ (BSI), ఐపీ వివరాలను అందిస్తామని మధ్యవర్తులు కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ప్రతివాదులు 7, 10, 11గా ఉన్న మధ్యవర్తులు గావస్కర్ పిటిషన్ను ఫిర్యాదుగా పరిగణించి వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. హక్కులు ఉల్లంఘిస్తున్న కంటెంట్కు సంబంధించిన స్పష్టమైన యూఆర్ఎల్లను 48 గంటల్లో కోర్టులో హాజరైన న్యాయవాది ద్వారా సమర్పించాలని పిటిషనర్కు సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ