
మచిలీపట్నం- గుడివాడ, , 15 డిసెంబర్ (హి.స.) స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కృష్ణా డెల్టాలోని రైతుబిడ్డలు స్థానికంగా ప్రాథమిక విద్యనభ్యసించినా, ఉన్నత చదువుల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. వారికి డిగ్రీ కోర్సులనూ అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో 1950లో గుడివాడలో పురుడు పోసుకున్న కళాశాల.. పల్లెటూరి పిల్లలనెందరినో ప్రపంచం గుర్తించే స్థాయిలో తీర్చిదిద్దింది. 1959లో ప్రసిద్ధ నటుడు అక్కినేని నాగేశ్వరరావు రూ.లక్ష విరాళం ఇవ్వడంతో ఏఎన్నార్ పేరుతో నామకరణం చేశారు. తొలుత 15 ఎకరాల్లో ఉన్న కళాశాల ప్రాంగణం తర్వాత మరో 10 ఎకరాలకు విస్తరించింది. ఈ చదువుల కోవెల 75 ఏళ్లుగా వేల మందికి ఉన్నత విద్యనందించి వారి భవితకు బంగారు బాటలు వేసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, సినీ కళాకారులనెందరినో అందించింది. డిసెంబరు 16 నుంచి 18 వరకు వజ్రోత్సవాలకు సిద్ధమైన ఏఎన్ఆర్ కళాశాల ప్రస్థానం.. స్ఫూర్తిదాయకం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ