
అమరావతి, 15 డిసెంబర్ (హి.స.)
ఏపీ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్క్ (Potti Sriramulu Memorial Park) పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Ponguru Narayana) తెలిపారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నెల్లూరులో నిర్వహించారు. అందులో భాగంగా నెల్లూరులో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు వెళ్లారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శనం మేరకు పొట్టి శ్రీరాములు జన్మించిన ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతేకాకుండా ఆయన గౌరవార్థం రాజధాని అమరావతిలో చేపట్టిన పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్క్ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. 58 అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రూపకర్తగా కాదు, గొప్ప సంఘ సంస్కర్తగా కూడా ఆయనను ప్రజలు ఎన్నటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV