
ఢిల్లీ26,డిసెంబర్ (హి.స.) భారత ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్ అత్యధిక ప్రారంభ స్థాయి వేతనాన్ని ప్రకటించింది. కృత్రిమ మేధ(ఏఐ) సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, డిజిటల్ నైపుణ్యం ఎక్కువగా ఉన్నవారిని ఆకర్షించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక టెక్నాలజీ ఉద్యోగాలకు మాత్రమే వర్తించే ఈ వార్షిక వేతనం రూ.21 లక్షల వరకు ఉండనుంది. ఇతర ఐటీ కంపెనీల్లోని స్పెషలైజ్డ్ రోల్స్తో పోల్చినా ఇది అధికం కావడం గమనార్హం.
ఆఫ్క్యాంపస్ ఎంపికలు త్వరలో: స్పెషలైజ్డ్ టెక్నాలజీ ఉద్యోగుల ఎంపిక కోసం ఇంజినీరింగ్, కంప్యూటర్ గ్రాడ్యుయేట్లకు ఇన్ఫోసిస్ త్వరలోనే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ప్రారంభించనుందని, వీరి వార్షిక పారితోషికం రూ.7-21 లక్షల వరకు ఉంటుందని ఆంగ్ల వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
స్పెషలిస్ట్ ప్రోగ్రామర్(ఎల్1 - ఎల్3), డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్(ట్రెయినీ) వంటి ఉద్యోగాలు ఉండనున్నాయి. బీఈ, బీటెక్, ఎమ్ఈ, ఎంటెక్, ఎమ్సీఏ, ఇంటిగ్రేటెడ్ ఎమ్ఎస్సీ(కంప్యూటర్సైన్స్) గ్రాడ్యుయేట్లు ఇందుకు అర్హులు. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్3 (ట్రెయినీ)కి రూ.21 లక్షలు, ఎల్2 ట్రెయినీకి రూ.16 లక్షలు, ఎల్1 ట్రెయినీకి రూ.11 లక్షలు, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ (ట్రైయినీ)కి రూ.7 లక్షల చొప్పున వార్షిక వేతనం ఇవ్వనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ