
ఢిల్లీ 07 డిసెంబర్ (హి.స.): భారత సైన్యం, హైదరాబాద్ ఐఐటీ కలిసి సరిహద్దుల్లో త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో మిలిటరీ బంకర్లను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. బంకర్ నిర్మించదలచుకున్న సైట్ వద్దకే నేరుగా రోబోటిక్ ప్రింటర్ను తీసుకెళ్లారు. అక్కడి భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అప్పటికప్పుడు అక్కడ నిర్మించాల్సిన బంకర్లను డిజైన్ చేస్తారు. వెంటనే త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో బంకర్ను సైట్లోనే బ్లాక్లుగా ప్రింట్ చేస్తారు. అక్కడే క్యూరింగ్ చేసి, బ్లాక్లను జతచేసి బంకర్ను నిర్మిస్తారు. 14 గంటల్లో బ్లాక్ల ప్రింటింగ్ పూర్తవుతుంది. 5 రోజుల్లో వాటిని క్యూరింగ్ చేసి, బంకర్ నిర్మాణం కూడా పూర్తి చేస్తారు. లద్దాఖ్లోని లేహ్ ప్రాంతంలో సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తున త్రీడీ బంకర్ను కాంక్రీట్ ప్రింటింగ్ చేసి, బ్లాక్లను అసెంబుల్ చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో జరిగిన త్రీడీ ప్రింటింగ్ బంకర్ నిర్మాణం. ఐఐటీలో భాగంగా ఉన్న స్టార్టప్ సింప్లిఫోర్జ్ క్రియేషన్స్, మిలిటరీలో భాగంగా ఉన్న త్రిశక్తి కోర్ కలిసి తొలి త్రీడీ ప్రింటింగ్ బంకర్ను నిర్మించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ