
ఢిల్లీ 07 డిసెంబర్ (హి.స.) గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి 25 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు పర్యాటకులు ఉన్నట్లు సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ తెలిపారు. మిగతావారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు, వారంతా కిచెన్ సిబ్బంది అని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగిన నైట్క్లబ్ రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఉంది. గతేడాది దీన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
సిలిండర్ పేలుడు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి సీఎం ప్రమోద్ కుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్లో భద్రతా చర్యలు పాటించలేదని తమకు తెలిసినట్లు చెప్పారు. విచారణలో భద్రతా ప్రమాణాలు పాటించనట్లు తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నామన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ