తర్న్ తరణ్ 10 మార్చి (హి.స.)అమెరికా సహా పలు దేశాలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్ డీలర్ను పంజాబ్ పోలీసులు పట్టుకున్నారు. ఎఫ్బీఐ మోస్ట్వాంటెడ్ జాబితాలో ఉన్న ఇంటర్నేషనల్ డ్రగ్ లార్డ్ షెహనాజ్ సింగ్ అలియాస్ షాన్ భిందెర్ను అరెస్టు చేసినట్లు పంజాబ్ డీజీపీ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. నార్కోటిక్స్ సిండికేట్లో అతడు కీలకంగా వ్యవహరిస్తున్నాడని, కొలంబియా నుంచి అమెరికా, కెనడాలోకి మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.
షెహనాజ్ అక్రమాలపై ప్రత్యేక నిఘా పెట్టిన అమెరికా ఎఫ్బీఐ ఫిబ్రవరి 26న అతడి అనుచరులను అరెస్టు చేసింది. వారినుంచి 391 కేజీల మెథంఫెటమైన్, 109 కేజీల కొకైన్ సహా నాలుగు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామాలతో షెహనాజ్ భారత్కు పారిపోయి వచ్చాడు. దానిపై నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పంజాబ్ తర్న్ తరణ్ పోలీసులు రహస్య ఆపరేషన్ చేపట్టారు. అతడి జాడను గుర్తించి తాజాగా అరెస్టు చేసినట్లు డీజీపీ వెల్లడించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు