విజయవాడ, 10 మార్చి (హి.స.)
న్యూఢిల్లీ, పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు రణరంగాన్ని తలపించే అవకాశాలు ఉన్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష సభ్యుల మఽధ్య తొలి రోజు నుంచే వాగ్యుద్ధాలు జరగనున్నాయి. హింసాకాండతో అతలాకుతలమైన మణిపూర్లో విధించిన రాష్ట్రపతి పాలనకూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారమే లోక్సభ ఆమోదముద్ర కోరనున్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మణిపూర్కు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు రానుంది. మణిపూర్లో రెండేళ్లుగా జరుగుతున్న హింసను అదుపు చేయలేక.. గత నెలలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్తో రాజీనామా చేయించి, రాష్ట్రపతి పాలన విధించాల్సి రావడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మణిపూర్లో హింసాకాండ ఆగకపోవడంపై సర్కారును నిలదీయనున్నాయి. మరోవైపు వక్ఫ్ బిల్లును పరిశీలించేందుకు వేసిన సంయుక్త పార్లమెంటు కమిటీ (జేపీసీ)లో తమ అభ్యంతరాలను తిరస్కరించి కేవలం ఎన్డీయే సభ్యుల ఆమోదంతో బిల్లుకు ఆమోదముద్ర వేసినందుకు ప్రతిపక్ష సభ్యులు గత సమావేశాల్లోనే గందరగోళం సృష్టించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల