విజయవాడ, 10 మార్చి (హి.స.)
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వేసవి కాలం వచ్చిందంటే పశ్చిమ చిత్తూరు జిల్లాలో తాగునీటి తిప్పలు తప్పవు. తగిన నీటి వనరులు లేకపోవడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటిపోయి అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన కూటమి ప్రభుత్వం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో జల్జీవన్మిషన్ పథకం ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా వైఎస్సార్ జిల్లాలోని గండికోట జలాశయం నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం వరకు తాగునీటిని సరఫరా చేయడానికి గ్రామీణ నీటిసరఫరాశాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల