చంఢీగడ్ 11 మార్చి (హి.స.)భారత సంతతికి చెందిన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా నాయకుడు షెహనాజ్ సింగ్ అలియాస్ షాన్ భిందెర్ పంజాబ్లో పట్టుబడ్డాడు. అమెరికాలో ఈ ఏడాది ఫిబ్రవరి 26న భారీ మొత్తంలో దొరికిన డ్రగ్స్ కేసులో ఇతడు కీలక నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో ఇప్పటికే షెహనాజ్ సింగ్ అనుచరులు ఆరుమందిని ఎఫ్బీఐ అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే షెహనాజ్ సింగ్ కోసం ఆ సంస్థ నిఘా పెట్టగా.. అతడు పారిపోయి భారత్కు వచ్చాడు. దీనిపై తమకు సమాచారం అందడంతో లుధియానాలో అతడిని అరెస్టు చేసినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ సోమవారం వెల్లడించారు. షెహనాజ్ సింగ్ కొలంబియా నుంచి అమెరికా, కెనడాకు 2014 నుంచి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. అలాగే భారత్లో 2024 డిసెంబరులో ఆయుధాల చట్టం కింద నమోదైన కేసులోనూ ఇతడు నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు