తెలంగాణ, కరీంనగర్. 11 మార్చి (హి.స.) పసుపు పంటకు మద్దతు ధర కోసం రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మెట్పల్లి రైతులు మంగళవారం రోడ్డెక్కారు. వ్యవసాయ మార్కెట్ నుంచి ర్యాలీగా కొనసాగి 63వ జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. పసుపునకు క్వింటాలకు పదిహేను వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎంఐఎస్ పథకం కింద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా పసుపును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
పసుపు రైతులకు మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల ముందు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్