విజయవాడ, 5 మార్చి (హి.స.)ధర్మవరం, పట్టువస్త్రంపై అందమైన డిజైన్లు రూపొందిస్తూ ధర్మవరం పట్టు వస్త్రాలకు డిజైనర్ నాగరాజు కొత్త అందాలు తీసుకొచ్చారు. చేనేత కార్మికుడిగా, డిజైనర్గా రాణిస్తూ పట్టువస్త్రాలపై సరికొత్త ప్రయోగాలు చేస్తూ వివిధ రకాల డిజైన్లను రూపొందించడంలో ఆయన అందె వేసిన చేయి. తాను రూపొందించిన డిజైన్లను రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇస్తూ ధర్మవరం పట్టు చీరల ఖ్యాతి, పట్టువస్త్రాల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తున్నారాయన. డిజైనింగ్ రంగంలో రాణిస్తున్న డిజైనర్ నాగరాజుకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ధర్మవరం చేనేత కార్మికుడు, డిజైనర్ నాగరాజుకు అరుదైన గౌరవం దక్కింది. అమృత్ మహోత్సవ్ ఈ నెల 6 నుంచి 9 వరకు రాష్ట్రపతి భవన్లో నిర్వహించనున్నారు. కేంద్రప్రభుత్వం చేనేతకు ప్రోత్సాహం కల్పించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఆయనకు దక్కింది. ఆయన రూపొందించిన పట్టువస్త్రాలతో పాటు ధర్మవరంలో చేనేత కార్మికులు తయారు చేసిన పట్టుచీరలను కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల