ఢిల్లీ , 5 మార్చి (హి.స.)ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పేదలకు అందని ద్రాక్షాగా మారింది. ఇదే అంశంపై సుప్రీం కోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను చివాట్లు పెట్టింది. సామాన్యులకు వైద్య సంరక్షణ,మౌలిక సదుపాయాలు కల్పిస్తూ భరోసా ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడింది. వైద్యాన్ని సామాన్యులకు దూరం చేయడమేకాదు.. వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులలో చేరేలా పరోక్షంగా సులభతరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రైవేట్ ఆస్పత్రులు తాము నిర్వహించే మెడికల్ షాపుల్లోనే మెడిసిన్లు, ఇంప్లాంట్స్, ఇతర మెడికల్ కేర్ ఉత్పుత్తులు కొనుగోలు చేయాలని పేషెంట్లను, వారి కుటుంబ సభ్యులను ఒత్తిడి చేస్తున్నాయని పిల్లో పేర్కొన్నారు. అంతేకాదు, రోగులకు అమ్మే మెడిసిన్లను సైతం వాస్తవ ధరకంటే అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని హైలెట్ చేశారు. ఫలితంగా రోగులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర,రాష్ట్రాలు ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ, దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ.. తమ ఫార్మసీలలో మాత్రమే మెడిసిన్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేయాలని పిల్లో కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు