విజయవాడ, 8 మార్చి (హి.స.)కడప జిల్లా పరిషత్తు ఛైర్మన్ పదవి విషయంలో వైకాపాలో విభేదాలు తలెత్తాయి. ప్రస్తుతం ఇన్ఛార్జి ఛైర్పర్సన్గా కొనసాగుతున్న జేష్టాది శారదను తప్పించాలనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇన్ఛార్జి ఛైర్మన్ పదవి కోసం ప్రస్తుతం వైస్ ఛైర్మన్గా ఉన్న బాలయ్య గట్టిగా పట్టుబడుతున్నారు. తన సామాజిక వర్గానికి కొన్నాళ్లు అవకాశం కల్పించాలని కీలక నేతల వద్ద మంతనాలు సాగిస్తున్నారు. జడ్పీ ఛైర్మన్గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు గ్రామీణ జడ్పీటీసీˆ సభ్యురాలు, జడ్పీ వైస్ ఛైర్పర్సన్గా ఉన్న శారదను ఇన్ఛార్జిగా నియమించారు. ఈమె గత తొమ్మిది నెలలుగా ఇన్ఛార్జి ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు.
ఇదే తరుణంలో తాడేపల్లిలో గతంలో వైకాపా అధినేత జగన్ జిల్లా నేతలతో సమావేశమై జడ్పీ ఛైర్మన్గా బ్రహ్మంగారిమఠం జడ్పీటీసీ సభ్యుడు రామగోవిందరెడ్డిని ఎంపిక చేశారు. వైకాపాకు జడ్పీలో సంపూర్ణ మెజార్టీ ఉండడంతో రామగోవిందరెడ్డి ఛైర్మన్ కావడం సులభంగా అప్పట్లో భావించారు. అయితే ఛైర్మన్ ఎంపిక కోసం నోటిఫికేషన్ వెలువడలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం సూచన మేరకు నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. 2021, సెప్టెంబరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మరో ఏడాదిన్నర రోజులపాటు పదవీకాలం ఉంది. నోటిఫికేషన్ వెలువడితే మినహా రామగోవిందరెడ్డి ఎన్నికయ్యే అవకాశాల్లేవు. దీన్ని గమనించిన పెండ్లిమర్రి జడ్పీటీసీ సభ్యుడు బాలయ్య తనకు ఇన్ఛార్జి ఛైర్మన్ పదవి ఇవ్వాలంటూ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి వద్ద ప్రస్తావించారు. ఈ విషయాన్ని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలంటూ సూచించడంతో ఆయన వద్దకు పలువురు జడ్పీటీసీ సభ్యులతో కలిసి వెళ్లారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం కల్పించాలని విన్నవించారు. ఎంపీ నుంచి ఎలాంటి హామీ రాలేదని సమాచారం. శారదకు ఇచ్చిన తరహాలో తనకు కొంత కాలం అవకాశం కల్పించాలని బాలయ్య గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ మేరకు పలువురు జడ్పీటీసీ సభ్యులను కూడగడుతున్నారు.
ST
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల