తెలంగాణ, 8 మార్చి (హి.స.) కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. 'కరీంనగర్ నుండి తిరుపతి రైలు(ఆది, గురు), తిరుపతి నుండి కరీంనగర్ (బుధ, శని) రైలు ప్రస్తుతం వారానికి రెండు సార్లు మాత్రమే నడుస్తుంది. ఈ రైలును తాను ఎంపీగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతి వెళ్ళడానికి సులభతరంగా ఉంటుందని యూపీఏ ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. తరువాత ఈ రైలును ప్రతిరోజూ నడిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గత 10 సంవత్సరాలుగా రైల్వే శాఖ మంత్రిగా మీకు, స్థానిక ఎంపీ బండి సంజయ్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఉత్తర తెలంగాణ నుండి తిరుపతి వెళ్ళే ప్రయాణికుల సమస్యలు తొలగించి కరీంనగర్ నుండి తిరుపతికి నిత్యం రైలు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా' అని లేఖలో పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్