ఢిల్లీ, , 9 మార్చి (హి.స.)భారత్ (India) అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తుందన్న అంశాన్ని తాను బహిరంగంగా లేవనెత్తడం వల్లే.. ఆ దేశం ఆందోళన చెంది సుంకాలను తగ్గించడానికి (Tariff cuts) అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల పేర్కొన్నారు. ఈ విషయంపై భారత అధికారిక వర్గాలు మాత్రం ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చుతునట్లు సమాచారం. సుంకాల తగ్గింపునకు చర్యలు నిజమే అయినప్పటికీ.. ఆయన ఆరోపణలతో తాము ఈ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి.
‘‘గతంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో భారత్ వరుసగా ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్విట్జర్లాండ్, నార్వే వంటి దేశాలపై సుంకాలను తగ్గించింది. ప్రస్తుతం ఐరోపా సమాఖ్య, యూకేతోనూ పలు ఒప్పందాల కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అగ్రరాజ్యంతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి వీటిని తగ్గించాలని న్యూదిల్లీ నిర్ణయం తీసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు