బెంగళూరు న్యూఢిల్లీ10 జూన్ (హి.స.) : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేడు (మంగళవారం) న్యూఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ను కలవనున్నారు. జూన్ 4న బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన ఘటనపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం చర్చించనున్నారని సమాచారం. ఈ తొక్కిసలాట ఘటన దరిమిలా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైంది. ఈ ఘటనకు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ ప్రత్యక్షంగా బాధ్యులని ఆరోపిస్తూ, వారు రాజీనామా చేయాలని కోరుతూ ప్రతిపక్ష బీజేపీ, జేడీ(ఎస్)లు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ను కలుసుకోనున్న సిద్ధరామయ్య, డీకేఎస్లు ఆర్సీబీ విజయోత్సవ ఘటన తొక్కిసలాట పూర్వాపరాలపై సమగ్రంగా చర్చించనున్నారు. ‘సిద్ధరామయ్య ఢిల్లీలో పార్టీ నాయకత్వాన్ని కలుస్తారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై వారికి వివరిస్తారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు