జడ్జీలు సైతం ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమే
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ
జడ్జీలు సైతం ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమే


న్యూఢిల్లీ, 10 జూన్ (హి.స.): సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ఇది ముఖ్యమైన భద్రతా వ్యవస్థగా కొనసాగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ చెప్పారు. కొలీజియం వ్యవస్థపై విమర్శలు వస్తున్నాయని అంగీకరించారు. ఈ వ్యవస్థ పరిపూర్ణం కాదని చెప్పారు. కానీ, కార్యనిర్వాహక వర్గం జోక్యం నుంచి న్యాయమూర్తులను రక్షించడంలో కొలీజియం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

అమెరికా పర్యటనలో ఉన్న జస్టిస్‌ సూర్యకాంత్‌ తాజాగా సియాటెల్‌ యూనివర్సిటీలోని ‘రౌండ్‌ గ్లాస్‌ ఇండియా సెంటర్‌’లో జరిగిన కార్యక్రమంతోపాటు మరో రెండు చోట్ల కీలక ప్రసంగాలు చేశారు. సుప్రీంకోర్టు ఇటీవల చేపట్టిన పలు చర్యలను ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను మెరుగుపర్చేందుకే వీటిని అమల్లోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచుకోవడానికి న్యాయవ్యవస్థ పదే పదే తమ పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొలీజియంపై వస్తున్న విమర్శలను నిరాకరించలేమని, ఈ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలన్న సంకల్పంతో న్యాయ వ్యవస్థ ముందడుగు వేస్తోందని ఉద్ఘాటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande