హైదరాబాద్, 16 జూన్ (హి.స.)
కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు బండి
సంజయ్ కి హైకోర్టు లో భారీ ఊరట లభించింది. బండి సంజయ్పై 2021 నవంబర్లో నమోదైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసును తెలంగాణ హైకోర్టు నేడు కొట్టివేసింది. 2021లో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలు రాగా, సూర్యాపేట జిల్లా పెన్పడ్కు చెందిన అప్పటి తహసీల్దార్ శేషగిరిరావు నవంబర్ 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పెన్పహాడ్ పోలీసులు బండి సంజయ్పై కేసు నమోదు చేశారు.
ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించగా... ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినట్లు నిరూపించబడలేదని బండి తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఈ కేసును సరైన సాక్ష్యాధారాల నిరూపణ లేని కారణంగా కొట్టివేసింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్