అమరావతి, 16 జూన్ (హి.స.)
మదనపల్లె నేరవార్తలు, స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన మదనపల్లె మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. మండలంలోని బసినికొండ పంచాయతీ నక్కలకుంట సమీపంలో నివాసం ఉండే ఎన్.గంగాధర్ (36) రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఇతనికి భార్య వనిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా సుమారు 12 గంటల ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ఇంట్లో చొరబడి రాయితో కొట్టి చంపేసినట్లు భార్య వనిత చెబుతున్నారు. విషయం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ మహేంద్ర, రూరల్ సీఐ కళా వెంకటరమణ, ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తలపై రాయితో కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. కొంతమంది ఇంట్లోకి రాగా మరికొందరు బయట ఉన్నారని, కళ్ల ముందే భర్తను కొట్టి చంపేశారని భార్య కన్నీటి పర్యంతమయ్యారు. మెడపై తాడుతో ఉరి వేసిన గుర్తులు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా సుమారు 15 ఏళ్ల కిందట ఇతని తండ్రి కృష్ణమూర్తి హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ