హైదరాబాద్, 16 జూన్ (హి.స.)
హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ ప్రభుత్వ భూమిపై నలుగురు ఎమ్మెల్యేలు హైకోర్టు లో పిల్ దాఖలు చేశారు. ఖాజాగూడలోని 27 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, యెన్నం శ్రీనివాస రెడ్డి, మురళీ నాయక్, అనిరుధ్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఖాజాగూడ సర్వే నెం.119,122 లో ఉన్న 27 ఎకరాల రూ.10 వేల కోట్ల విలువైన భూమిని సర్వే నెంబర్లు మార్చి ఆక్రమించారని పిటిషనర్ల తరపున న్యాయవాది వాదించారు.
2023 లో రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వడంతో GHMC భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని, ప్రస్తుతం ఆ స్థలంలో 47 అంతస్తులు గల 8 టవర్లను నిర్మిస్తున్నారని తెలిపారు. ఇవన్నీ ఖాజాగూడ చెరువు FTL పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు. కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరారు. అనంతరం.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, రెవెన్యూ కార్యదర్శికి, రంగారెడ్డి కలెక్టర్ కి, GHMC కి, హైడ్రాకు నోటీసులు జారీ చేసి, విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..