తెలంగాణ, మెదక్. 16 జూన్ (హి.స.)
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భూ భారతి సమావేశాన్ని గ్రామస్థులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. వివరాల ప్రకారం.. సర్వేనెంబర్ 393, 441లో ప్రభుత్వ భూమిని 2005 లో గ్రామస్తులకు పట్టాలిచ్చారు. అనంతరం పరిశ్రమల మండలికి ఆ భూమిని కేటాయించారు. నష్టపరిహారం ఇవ్వడంలో తమకు అన్యాయం చేస్తున్నారంటూ, తమకు న్యాయం జరిగేంతవరకు భూభారతి, రెవెన్యూ, సదస్సులను జరగనివ్వమంటూ మహిళలు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
నష్టపరిహారం ఇవ్వాలంటూ తహశీల్దార్ కు, ఆర్డీఓకు, కలెక్టర్కు వినతిపత్రం సమర్పించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు