తెలంగాణ, నిజామాబాద్. 17 జూన్ (హి.స.) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో నిన్నటి నుండి కనిపించకుండా పోయిన వ్యక్తి నేడు శవమై దొరికాడు. వినాయక్నగర్లోని వెంకీస్ గోల్డెన్ అపార్ట్మెంట్లో నివాసముండే ఏముల రాజమౌళి (60) అనే వ్యక్తి ఈనెల 16న ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంట్లోంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు సదరు వ్యక్తి ఫొటోతో పాటు వివరాలను పలు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టడంతోపాటు కుటుంబ సభ్యులు ఫోర్త్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రాజమౌళి మృతదేహాన్ని వినాయక్ నగర్లోని 100 ఫీట్ల రోడ్డు చివరలో గల వాగులో గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వాగులో నుంచి వెలికి తీయించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు