వరంగల్, 17 జూన్ (హి.స.)
ఎలాంటి రాజ్యంగ పదవి లేని కాంగ్రెస్ నాయకుడు కొండా మురళికి ఎస్కార్ట్ కల్పించిన పోలీసు అధికారులపై వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సీరియస్ గా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా కొండా మురళికి ఎస్కార్ట్ కల్పించిన వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, సీఐ షూకూర్తో సహా మరో ఇద్దరు అధికారులకు మెమోలు జారీ చేశారు. మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలుపలంటూ సీపీ మెమోలో అధికారులను వివరణ కోరారు. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం పోలీసు అధికారులు కొండా మురళికి ఎస్కార్ట్ తీసుకెళ్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఈ విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లడం, ప్రతిపక్షాలు, సామాన్య జనాలు, ముఖ్యంగా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో దీనిపై ప్రభుత్వం సీరియస్గా స్పందించినట్లు సమాచారం. అందులో భాగంగానే సీపీ వరంగల్ డివిజన్ పోలీస్ అధికారులకు మెమో జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..