విశాఖపట్నం, 21 జూన్ (హి.స.) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖపట్నంలో అపూర్వ దృశ్యం ఆవిష్కృతమైంది. నగరవాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చి యోగా సాధనలో పాల్గొన్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రజలు యోగా డే వేదిక వద్దకు చేరుకోవడం మొదలుపెట్టారు. ఉదయం 5:45 గంటల సమయానికే సుమారు లక్షన్నర మంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు.
ఈ భారీ జనసమీకరణతో గతంలో సూరత్లో 1,47,952 మందితో నెలకొల్పిన యోగా రికార్డును విశాఖ అధిగమించినట్లయింది. కార్యక్రమానికి హాజరైన వారి సంఖ్యను నిర్ధారించేందుకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకున్న వారిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నట్లు వారు స్పష్టం చేశారు.
ఉదయం 7 గంటల సమయానికి హాజరయ్యే వారి సంఖ్య మరో లక్ష వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో యోగా డే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వివిధ వయసుల వారు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఉత్సాహంగా యోగాసనాలు వేయడం విశేషం. ఈ కార్యక్రమం ప్రజలలో ఆరోగ్యం మరియు యోగా పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది.
ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహణపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉదయం 5 గంటలకే ఆయన మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. యోగా దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లు, ప్రజల భాగస్వామ్యం, సౌకర్యాల కల్పన వంటి అంశాలపై కూలంకషంగా సమీక్షించారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తెల్లవారుజాము 4 గంటల నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యక్రమ స్థలాలకు చేరుకోవడం ప్రారంభించారని తెలిపారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా యోగాసనాలు వేసేందుకు తరలివస్తున్నారని, ముఖ్యంగా యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, ముఖ్యంగా తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఏర్పాట్ల విషయంలో మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి