దిల్లీ, 23 జూన్ (హి.స.): పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారా ఉద్రిక్తతల్ని సడలించుకోవాలని పిలుపునిచ్చారు. ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆదివారం మోదీతో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత దాడులను ఆపేయాలని, శత్రుత్వాన్ని తగ్గించుకోవాలని మోదీ ఈ సందర్భంగా కోరారు. ప్రాంతీయంగా వీలైనంత త్వరగా శాంతి, సుస్థిరతలను పునరుద్ధరించాలంటే చర్చలే మార్గమని గట్టిగా చెప్పారు. ప్రస్తుత పరిస్థితిపై ఇరువురూ సమగ్రంగా చర్చించుకున్నామని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. శాంతి, మానవత్వాల వైపే భారత్ ఉంటుందని చెప్పారు. భారతీయుల్ని ఇరాన్ నుంచి క్షేమంగా తీసుకురావడంలో పెజెష్కియాన్ అందిస్తున్న నిరంతర సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. వాణిజ్యం, ఆర్థిక సహకారం, శాస్త్ర-సాంకేతిక రంగాలు, ప్రజల మధ్య సంబంధాల విషయంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకునేలా పనిచేసేందుకు కట్టుబాటును ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు